భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడ
భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. ఇటీవల సుంకాల పేరుతో భారత్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ధోరణిలో ఇప్పుడు గణనీయమైన మార్పు కనిపిస్తోంది. భారత్, చైనా, రష్యా మధ్య పెరుగుతున్న స్నేహం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ ద్వారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై నా స్నేహితుడు, భారత ప్రధానమంత్రి మోదీతో త్వరలోనే మాట్లాడతా. ఇండియాతో ట్రేడ్ డీల్ విజయవంతమవుతుందని నమ్ముతున్నా” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో భారత్పై కఠిన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు మిత్రభావంతో మోదీని పొగడటం విశేషం. రష్యా నుంచి భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, ఆర్థిక ఒత్తిళ్లు సృష్టించేందుకు భారత దిగుమతులపై భారీ పన్నులు కూడా విధించారు. అయితే, కొన్ని రోజుల్లోనే తన మాట మార్చి మోదీని ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రధాని మోదీ ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ పరిణామాలపై ట్రంప్ ప్రారంభంలో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, తర్వాత మోదీతో చర్చలు జరపాలనే ఉత్సాహాన్ని చూపారు.
నిపుణుల ప్రకారం, అమెరికా-భారత్ సంబంధాలు వాణిజ్యం, రక్షణ, అంతర్జాతీయ వ్యూహాత్మక అంశాల్లో మరింత బలోపేతం కావచ్చని అంచనా వేస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఈ దిశగా కొత్త మార్గం సుగమం చేస్తున్నాయని భావిస్తున్నారు.

COMMENTS