హైదరాబాద్ ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ. కవిత ఆరోపణలు, మాధవరం కృష్ణారావు పాత్రపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి. IDPL Land Row: హైదరాబాద్
హైదరాబాద్ ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతంపై విజిలెన్స్ విచారణ. కవిత ఆరోపణలు, మాధవరం కృష్ణారావు పాత్రపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి.
IDPL Land Row: హైదరాబాద్లోని ఐడీపీఎల్ భూముల అన్యాక్రాంతం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన భూములు అక్రమంగా ఎవరి చేతుల్లోకి వెళ్లాయన్న అంశంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, భూ వినియోగ మార్పిడి ఎలా జరిగింది అనే అంశాలపై నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది.
విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిన పత్రాలు, చేసిన ఆరోపణలే ఈ విచారణకు ప్రధాన ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం సహకారంతో జరిగిన భూ వినియోగ మార్పిడిపై కూడా విజిలెన్స్ ప్రత్యేక దృష్టి సారించింది. కవిత చేసిన ఆరోపణల ప్రకారం.. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదెకరాల పారిశ్రామిక భూమిని నివాస భూమిగా మార్చిందని, నిబంధనలను ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారితీసిందని పేర్కొన్నారు. ఈ మార్పిడి వెనుక భారీగా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం విజిలెన్స్ బృందం సర్వే నంబర్ 376లోని మొత్తం భూమి విస్తీర్ణం, ఎంత మేరకు అన్యాక్రాంతమైంది, ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత, ఆక్రమణదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా చేరాయన్న అంశాలను సవివరంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా మాధవరం కుమారుడి చెరువు కబ్జా, నవనామీ వెంచర్స్కు ఇచ్చిన అనుమతులు, అందులో భాగస్వాములుగా ఉన్న వారి పాత్రపై అధికారులు ఫైళ్లను జల్లెడ పడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి నిబంధనలు ఉల్లంఘించిన అధికారుల జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ వివాదం మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంతో మొదలైంది. ఐడీపీఎల్ భూములను ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ అక్రమంగా కబ్జా చేశారని ఆయన ఆరోపిస్తూ పలు పత్రాలు విడుదల చేశారు. అయితే కవిత ఈ ఆరోపణలను ఖండిస్తూ, తన భర్త 2019లోనే పెట్టుబడుల నుంచి తప్పుకున్నారని స్పష్టం చేశారు. అసలు అక్రమాలు ఆ తర్వాతే జరిగాయని, నవనామీ వెంచర్స్ చేతుల్లోకి భూములు వెళ్లాయని వెల్లడించారు. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్కు సన్నిహితుడైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి భాగస్వామ్యం ఉందని కవిత చేసిన ఆరోపణలు మరింత దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన విజిలెన్స్ విచారణలో మరిన్ని సంచలన నిజాలు బయటపడతాయన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS