బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 15 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు..! హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సుపై కొండ చరియలు విరిగిపడి 15మంది
బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 15 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు..!
హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సుపై కొండ చరియలు విరిగిపడి 15మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. బిలాస్పూర్లోని ఝండుత అసెంబ్లీ నియోజకవర్గంలోని బర్తిన్ ప్రాంతంలో మంగళవారం (అక్టోబర్ 7) సాయంత్రం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భల్లు వంతెన సమీపంలోని కొండపై నుండి భారీ రాళ్లు, శిథిలాలు ఒక్కసారిగా కూలిపడి బస్సుపై పడ్డాయి. క్షణాల్లోనే బస్సు తునాతునకలైపోయింది.
స్థానికుల సమాచారం మేరకు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అకస్మాత్తుగా రాళ్లు కూలిపోవడంతో ప్రయాణికులు కేకలు వేస్తూ బయటపడేందుకు ప్రయత్నించారు. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. పోలీసులకు సమాచారం అందించగా, జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించి గాయపడిన వారిని ఘుమార్విన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు ఝండుత ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం 15 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ముగ్గురు ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. నిరంతరం జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
COMMENTS