75 బుల్డోజర్లతో మళ్లీ మొదలైన కూల్చివేతలు.. ఈ సారి ఏకంగా 2500 ఇళ్లు నేలమట్టం! గుజరాత్లో భారీ కూల్చివేత ఆపరేషన్... బంగ్లాదేశ్ వలసదారులపై ఫోకస్ గుజర
75 బుల్డోజర్లతో మళ్లీ మొదలైన కూల్చివేతలు.. ఈ సారి ఏకంగా 2500 ఇళ్లు నేలమట్టం!
గుజరాత్లో భారీ కూల్చివేత ఆపరేషన్… బంగ్లాదేశ్ వలసదారులపై ఫోకస్
గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రభుత్వం మరోసారి అక్రమ నిర్మాణాలపై గట్టి చర్యలకు దిగింది. అక్రమంగా నిర్మించిన వేలాది ఇళ్లపై రెండో దఫా కూల్చివేతలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చందోలా సరస్సు పరిధిలో 2,500కు పైగా ఇళ్లను కూల్చేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ యంత్రాంగం భారీ చర్యలు చేపట్టింది.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ నివాసాల్లో అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ వలసదారులు నివసిస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 29, 30 తేదీలలో జరిగిన మొదటి దశ కూల్చివేతల్లో 3 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ఈసారి కూల్చివేత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేపట్టేందుకు 75 బుల్డోజర్లు, 150 డంపర్లతో పాటు 8,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. శాంతి భద్రతలు కాపాడేందుకు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
చందోలా సరస్సు ప్రాంతం గత కొన్ని దశాబ్దాలుగా పత్రాలు లేని బంగ్లాదేశ్ వలసదారుల స్థావరంగా మారినట్టు తెలుస్తోంది. 2002లో ఓ స్వచ్ఛంద సంస్థ ‘సియాసత్ నగర్’ అనే స్థావరాన్ని ఏర్పాటు చేయడమే దీనికి నాంది అయినట్టు సమాచారం. దీంతో ఈ ప్రాంతం మానవ అక్రమ రవాణా, నకిలీ పత్రాల వ్యవహారానికి కేంద్రబిందువుగా మారిందని అధికారులు గుర్తించారు.
2010 నుండి 2024 మధ్యకాలంలో ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు పెద్దఎత్తున పెరిగాయి. ప్రభుత్వం భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టవిరుద్ధ వలసలను అరికట్టడం, నేరస్థుల ముఠాలను నిర్మూలించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అధికారులు తెలిపారు.

COMMENTS