బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ – RTC చార్జీల పెంపుపై కేటీఆర్, హరీశ్ ఆగ్రహం తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్సు ఛార్జ
బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ – RTC చార్జీల పెంపుపై కేటీఆర్, హరీశ్ ఆగ్రహం
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన ‘చలో బస్ భవన్’ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ నేతల గృహ నిర్బంధంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “మేము శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని పిలుపునిచ్చాం. కానీ పోలీసుల ఈ విధమైన అప్రజాస్వామిక చర్య అర్థం కావడం లేదు. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా అడ్డుకోవడానికి అంతమంది పోలీసులను మోహరించడం విచారకరం. మాపై పోలీసులు చూపిస్తున్న ఉత్సాహం హైదరాబాద్లో జరుగుతున్న నేరాల నియంత్రణలో చూపిస్తే బాగుంటుంది” అని అన్నారు.
అతను ఇంకా మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, RTC చార్జీల పెంపును వెనక్కి తీసుకునే వరకు బీఆర్ఎస్ నిరసన కొనసాగుతుంది. ఇలాంటి నిర్బంధాలు మాకు కొత్తకాదు” అని స్పష్టం చేశారు.
అటు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “నిరుపేదల నడ్డి విరుస్తూ అడ్డగోలుగా RTC బస్సు చార్జీలు పెంచారు. ప్రజలపై ఆర్థిక భారం మోపడం దుర్మార్గం. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్ రావు ఇంకా వ్యాఖ్యానిస్తూ, “20 నెలల్లో ఐదు సార్లు బస్సు చార్జీలు పెంచారు. భార్యకు ఫ్రీ అని చెప్పి భర్తలకు, విద్యార్థులకు టికెట్లు డబుల్ చేశారు. జీవో 53, 54లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు. ఇక మెట్రో ప్రాజెక్ట్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది” అని మండిపడ్డారు.
ఈ ఘటనలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్టులపై పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.

COMMENTS