ఓఎంసీ కేసులో బెయిల్ తీర్పుకు వాయిదా….. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఓఎంసీ కేసులో బెయిల్ తీర్పుకు వాయిదా…..

Homeతెలంగాణ

ఓఎంసీ కేసులో బెయిల్ తీర్పుకు వాయిదా…..

ఓఎంసీ కేసులో దోషుల బెయిల్‌పై హైకోర్టు తీర్పుకు వాయిదా – విచారణ ఆగస్టు 11కు మార్చింది. హైదరాబాద్, వెలుగు: ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ) కేసుల

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి….
బెట్టింగ్‌ బానిస – యువకుడు ఆత్మహత్య….
కొనసాగుతున్న వేములవాడ పట్టణ బంద్…

ఓఎంసీ కేసులో దోషుల బెయిల్‌పై హైకోర్టు తీర్పుకు వాయిదా – విచారణ ఆగస్టు 11కు మార్చింది.
హైదరాబాద్, వెలుగు:
ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ) కేసులో దోషులైన గాలి జనార్దన్ రెడ్డి, బి.వి. శ్రీనివాసరెడ్డి, వి.డి. రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్ లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు సోమవారం తీర్పును వాయిదా వేసింది. అంతేగాక, ఓఎంసీ కంపెనీ తరపున దాఖలైన అప్పీళ్లను కూడా విచారణకు స్వీకరించిన హైకోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది. కింది కోర్టు తీర్పులకు సంబంధించి పూర్తి రికార్డులను రిజిస్ట్రీ ద్వారా సేకరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
ఈ కేసులో మే 6న సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దానిని సవాలు చేస్తూ దోషులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం ఈ పిటిషన్లను విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదిస్తూ, దోషులు శిక్షలో సగానికి పైగా ఇప్పటికే అనుభవించారని, పైగా గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నందున ప్రజా ప్రతినిధిగా ఆయనకు బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. శిక్ష నిలిపివేయకపోతే, తదుపరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు అతను పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని వాదించారు.
సీబీఐ తరఫున న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదిస్తూ, బెయిల్ మంజూరుపై తాము కోర్టు విచక్షణను గౌరవిస్తున్నామన్నారు. అయితే, కింది కోర్టు ఇచ్చిన శిక్షలను సస్పెండ్ చేయడం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.
వాదనలు విన్న న్యాయమూర్తి, దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను విచారణకు స్వీకరిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ పిటిషన్లపై మంగళవారం విచారణ చేపడతామని పేర్కొన్నారు.
కేసులో ఆరో నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మి దాఖలు చేసిన అప్పీల్‌పైనా హైకోర్టు స్పందించింది. సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువులోగా ఈ పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube