హైదరాబాద్: మాజీ ఎస్ఐబీ (SIB) చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని పేరు ప్రధాన నిందితుడిగ
హైదరాబాద్: మాజీ ఎస్ఐబీ (SIB) చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని పేరు ప్రధాన నిందితుడిగా (A1) నమోదు కాగా, గత కొన్ని నెలలుగా ఆయన అమెరికాలో ఉండటం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో SIB చీఫ్గా ఉన్నప్పటి కాలంలో జరగిన ఫోన్ ట్యాపింగ్ ఘటనలకు సంబంధించి ప్రభాకర్ రావుపై సీరియస్ ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదు అయిన తర్వాత ఆయన దేశం విడిచి అమెరికాకు వెళ్లిపోయారు.
అయితే ఈ వ్యవహారంపై న్యాయపరంగా పోరాడుతూ, సుప్రీం కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అతనికి ముందస్తు అరెస్టు నుండి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి రావడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఆయన ఇప్పటికే విమాన ప్రయాణం మొదలుపెట్టినట్టు సమాచారం, మరికాసేపట్లో ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ పలు కీలక పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు, అధికారిక సమాచారం బయటపడే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే బీఆర్ఎస్ పాలనలో జరిగిన పలు కీలక పరిణామాలపై వెలుగుచూసే అవకాశముంది.
ప్రభాకర్ రావు హైదరాబాద్ రాక నేపథ్యంలో పోలీసులు, న్యాయ విభాగాలు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కేసు తెలంగాణలో రాజకీయంగా మరింత వేడి పుట్టించనుంది.

COMMENTS